రోజుకు ఈ కార్పొరేట్‌ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?

17 Feb, 2021 13:58 IST|Sakshi

భారీగా పుంజుకున్న ఎన్‌సీసీ స్టాక్‌ 

రాకేష్‌ ఝన్‌ ఝన్‌ వాలా జంట ఆస్తి జూమ్‌

రోజుకు రూ.18.4 కోట్లు 

సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్‌ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిల్చుకునే రాకేష్‌ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్‌ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం  ఝన్‌ ఝన్‌ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్‌సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది.

2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్‌సిసి షేర్లలో 12.84 శాతం వాటాను  ఈ జంట సొంతం.  జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్‌సిసి స్టాక్  ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల  షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది.  11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్‌, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా  ఎన్‌సీసీ  షేరు ధర రూ.89.15 గా  ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు