సాఫ్ట్‌వేర్‌ సేవల రామ్‌కో.. స్పీడ్‌

5 Sep, 2020 16:07 IST|Sakshi

వారాంతాన 5 శాతం అప్పర్‌ సర్య్యూట్‌

52 వారాల గరిష్టానికి రామ్‌కో సిస్టమ్స్‌

గత నెల రోజుల్లో 105 శాతం ర్యాలీ

3 నెలలుగా దూకుడు-  277 శాతం అప్‌

ఐటీ కన్సల్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌ కొద్ది రోజులుగా ఇన్వెస్టర్ల ఫేవరెట్ షేరుగా నిలుస్తోంది. ఈ బాటలో అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో వరుసగా రెండో రోజు శుక్రవారం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 275 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్‌ కొనసాగడంతో గత నెల రోజుల్లోనే ఈ కౌంటర్‌ 105 శాతం ర్యాలీ చేసింది. అంతేకాకుండా గత మూడు నెలల కాలాన్ని పరిగణిస్తే.. 277 శాతం దూసుకెళ్లింది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 13 శాతమే లాభపడటం గమనార్హం!

పలు అంశాలు
పలు సానుకూల అంశాల నేపథ్యంలో క్లౌడ్‌ ఆధారిత ఐటీ సేవలందించే రామ్‌కో సిస్టమ్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జూన్‌ 10న ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కిషన్‌లాల్‌ కేడియా రామ్‌కో సిస్టమ్స్‌లో షేరుకి రూ. 87.8 ధరలో దాదాపు 3.4 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. 1.1 శాతం వాటా కొనుగోలుకి రూ. 3 కోట్లు వెచ్చించారు. ఇదే విధంగా ఎన్‌ఎస్‌ఈ బల్క్‌ డేటా ప్రకారం గత వారం రామ్‌కో సిస్టమ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌.. షేరుకి రూ. 240 ధరలో 1.57 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఈ బాటలో ఇటీవల విభిన్న పథకాల ద్వారా 2.25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో  కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ వాటా తాజాగా 8.65 శాతానికి ఎగసింది.

భారీ డీల్‌..
మలేసియాకు చెందిన డైవర్సిఫైడ్‌ బిజినెస్‌లు కలిగిన యుటిలిటీస్‌, ఇన్‌ఫ్రా గ్రూప్‌తో మల్టీ మిలియన్‌ డాలర్‌ డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్‌ గత నెల 25న వెల్లడించింది. తద్వారా గ్రూప్‌ కంపెనీలకు పోర్టులు, లాజిస్టిక్స్‌ కార్యకలాపాలలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌ నేపథ్యంలో రామ్‌కో ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌ మలేసియాలోని 50 శాతం పోర్టుల నిర్వహణలో ఐటీ సేవలు అందించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు