Yes Bank Case: మనవడికి 40 కోట్ల ఆస్తి రాసిన బిందు రాణా కపూర్‌

21 Aug, 2021 09:43 IST|Sakshi

బిందు రాణా కపూర్‌.. యస్‌ బ్యాంక్‌ ఫౌండర్‌, మాజీ ఎండీ రానా కపూర్‌ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని  పలు సంస్థలకు యస్‌బ్యాంక్‌ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. 

ఢిల్లీలోని పోష్‌ ఏరియా జోర్‌బాగ్‌లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్‌ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్‌. ఈ డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్‌కీ డాట్‌కామ్‌ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన 36 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్‌ ఖన్నా తల్లి రాధా కపూర్‌ గార్డియన్‌గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. 
ఇది చదవండి: యస్‌ బ్యాంక్‌ నష్టం, ఎన్ని కోట్లంటే..

గతేడాది జులైలో యస్‌ బ్యాంక్‌ మోసాలు.. మనీలాండరింగ్‌ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లండన్‌లోని రాణా కపూర్‌కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కూడా ఈ మధ్యే ఎటాచ్‌ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్‌ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్‌ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్‌, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్‌ గౌతమ్‌ థారప్‌లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్‌జాక్షన్‌ చూపించడాన్ని ఇల్లీగల్‌గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్‌ కేసు నడుస్తోంది.

మరిన్ని వార్తలు