Rasna Founder Death: ‘రస్నా’ ఫౌండర్‌ కన్నుమూత, ‘మిస్‌ యూ’ అంటున్న అభిమానులు

21 Nov, 2022 17:09 IST|Sakshi

ఎన్నో పార్టీల్లో, ఎందరి నోళ్లనో తీపి చేసిన ‘రస్నా’  వ్యవస్థాపకుడు అరిజ్ పిరోజ్‌షా ఖంబట్టా  కన్నుమూత

సాక్షి, ముంబై: గ్లోబల్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్లో సంచలనం సృష్టించిన దేశీయ శీతల పానీయం ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరిజ్ పిరోజ్‌షా ఖంబట్టా కన్నుమూశారు. 85 సంవత్సరాల వయస్సులో శనివారం మరణించినట్లు  సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ  తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించినట్లు ప్రకటించింది. అరిజ్ ఖంబట్టా బెనివలెంట్ ట్రస్ట్,  రస్నా ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.  

పలువురు వ్యాపార దిగ్గజాలు ఖంబట్టా మృతిపై సంతాపం ప్రకటించారు.ఐకానిక్‌ డ్రింక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మిమ్మల్ని మరువలేం.. మిస్‌ యూ సార్‌ అంటూ అభిమానులు  ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. 

1980-90లలో ఏ నోట విన్నా ‘ఐ లవ్‌ యూ రస్నా’ అన్న మాట వినబడేది. ఫంక్షన్‌ ఏదైనా,  సందర్భంగా ఏదైనా రస్నా నాలేని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. మ్యాంగో, ఆరెంజ్‌, నింబూ ఇలా పలు ఫ్లేవర్లలో ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో  పాపులర్‌ అయిన డ్రింక్‌ రస్నా మార్కెట్ లీడర్‌గా ఉంది. 1970 లలో అధిక ధరలకు విక్రయించే శీతల పానీయాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా రస్నా  బహుళ ప్రజాదరణ పొందింది. దేశంలోని 18 లక్షల రిటైల్ ఔట్‌లెట్లలో సామాన్యులకు సైతం అందుబాటులో ధరలో పాపులర్‌  బ్రాండ్‌గా నిలిచింది. 

అరిజ్ కు  భార్య పెర్సిస్ , పిల్లలు పిరుజ్, డెల్నా  రుజాన్, కోడలు బినైషా , మనవళ్లు అర్జీన్, అర్జాద్, అవన్, అరీజ్, ఫిరోజా, అర్నావాజ్ ఉన్నారు. దశాబ్దాల క్రితం అరిజ్‌ తండ్రి ఫిరోజా ఖంబట్టా నిరాడంబరమైన వ్యాపారాన్ని ప్రారంభించారు.  దీని వ్యవస్థాపక ఛైర్మన్‌ అరీజ్‌నేతృత్వంలో  రస్నా ది ఇంటర్నేషనల్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్, బెల్జియం కేన్స్ లయన్స్ లండన్, మోండే సెలక్షన్ అవార్డు, మాస్టర్ బ్రాండ్ ది వరల్డ్ బ్రాండ్ కాంగ్రెస్ అవార్డు,  ITQI సుపీరియర్ టేస్ట్ అండ్ క్వాలిటీ అవార్డుతో సహా ప్రతిష్టాత్మకమైన సుపీరియర్ టేస్ట్ అవార్డ్ 2008తో సహా పలు అవార్డులను గెలుచుకుంది.

మరిన్ని వార్తలు