మార్కెట్లో ఆర్‌బీఐ అప్రమత్తత

8 Jun, 2022 00:04 IST|Sakshi

పాలసీ వెల్లడికి ముందు లాభాల స్వీకరణ 

సూచీలకు మూడోరోజూ నష్టాలే  

ఆటో, ఇంధన షేర్లకు మాత్రమే లాభాలు 

568 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

16,500 దిగువకు నిఫ్టీ  

ఇన్వెస్టర్లకు రూ.2.13 లక్షల కోట్ల నష్టం

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టంతో ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు ఒకశాతానికి పతనాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 793 పాయింట్ల క్షీణించింది. చివరికి 568 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ట్రేడింగ్‌లో నిఫ్టీ 223 పాయింట్లు  పతనమైంది. మార్కెట్‌ ముగిసే సరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ నష్టాల ముగింపు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ఒకశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,294 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,311 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 12 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 77.78 స్థాయి వద్ద స్థిరపడింది.  

రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయం 
సెన్సెక్స్‌ పతనంతో బీఎస్‌ఈలో రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.254.28 లక్షల కోట్లకు దిగివచ్చింది.   

మార్కెట్లో మరిన్ని సంగతులు  

  • ఎల్‌ఐసీ షేరు ఆరోరోజూ పడింది.  3%పైగా పతనమై రూ.753 వద్ద ముగిసింది.  ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే  20% క్షీణించింది  
  • క్రూడాయిల్‌ పెరుగుదల ఆయిల్‌ ఇండియా షేరుకు కలిసొచి్చంది. బీఎస్‌ఈలో మూడు శాతం లాభపడి రూ.286 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో రూ.301 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

నష్టాలకు నాలుగు కారణాలు 
ఆర్‌బీఐ పాలసీ సమావేశం: ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. వడ్డీరేట్ల పెంపు ఖాయమే అయినప్పటికీ.., ఎంతమేర పెంపు ఉండొచ్చనే అంశంపై మార్కెట్‌ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, అంతర్జాతీయ అనిశి్చతులపై ఆర్‌బీఐ స్పందన కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.  

క్రూడాయిల్‌ ధరల సెగలు 
ఆసియా దేశాలకు ఎగుమతి చేసే అన్ని రకాల ఆయిల్‌ ధరలను జూలై నుంచి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా చేసిన ప్రకటనతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 120 డాలర్లు దాటింది. క్రూడ్‌ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్‌ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. 

బాండ్లపై పెరిగిన రాబడులు  
ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తాజాగా పదేళ్ల కాలపరిమితి గల బాండ్లపై రాబడులు మూడేళ్ల గరిష్ట స్థాయి 7.54 శాతానికి చేరింది. క్రూడాయిల్‌ ధరల అనూహ్య పెరుగుదల, ఆర్‌బీఐ పాలసీ సమావేశం సందర్భంగా అప్రమత్తతతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా ఈక్విటీలను అమ్మేసి.., పెట్టుబడులను బాండ్లలోకి మళ్లిస్తున్నారు.  

యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్ల పతనం 
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతీ శాయి. ఆ్రస్టేలియా కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఇదే కఠినతర ద్రవ్యపాలసీ వైఖరిని అనుసరించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్‌ మార్కె ట్లు 1% నుంచి 1.5% క్షీణించాయి. యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్లు 1% నష్టాల్లో ట్రేడయ్యాయి. 

మరిన్ని వార్తలు