పిరమల్‌ చేతికి దివాన్‌ హౌసింగ్‌

19 Feb, 2021 05:35 IST|Sakshi

రుణ పరిష్కార ప్రణాళికకు ఆర్‌బీఐ ఓకే

న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)ను పిరమల్‌ గ్రూప్‌ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్‌బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను కొనుగోలు చేసేందుకు పిరమల్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్‌ గ్రూప్‌ కంపెనీ పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది.  

భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లోనూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు సిఫారసు చేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్‌ఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు