ముత్తూట్‌ విభాగానికి షాక్‌.. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ రద్దు!

5 Jan, 2022 07:36 IST|Sakshi

ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాకిచ్చింది. వెహికిల్స్‌ విభాగానికి సంబంధించిన ముత్తూట్‌ వెహికిల్‌ అండ్‌ అస్సెట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు ఆథరైజేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  


నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్‌ బ్యాంక్‌ తరపున సేవలు అందిస్తోంది ఈకో.   


సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్‌ వెహికిల్‌ ఫైనాన్స్‌, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, ఈ కంపెనీలపై PSOలుగా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ ఉన్న కస్టమర్‌లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించవచ్చు.

ఇదిలా ఉంటే పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌ 2007లోని విచక్షణ అధికారాల్ని వినియోగించి బ్యాంకుల పెద్దన్న ఈ నిర్ణయం తీసుకుంది. సీవోఏ క్యాన్సిలేషన్‌ డిసెంబర్‌ 31నే జరిగినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం జనవరి 4న చేసింది ఆర్బీఐ.


చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ!

మరిన్ని వార్తలు