Raghuram Rajan: అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

16 May, 2022 08:31 IST|Sakshi

మెజారిటీవాదం తీవ్ర హానికరం 

ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ విశ్లేషణ   

న్యూఢిల్లీ: భవిష్యత్‌ భారతానికి మెజారిటీవాదం తీవ్ర హానికరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ విశ్లేషించారు. భారత్‌ పురోగతిని ప్రతి దశలోనూ ఈ మెజారిటీవాదం నిరోధిస్తుందని ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్‌ చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్‌ అన్నారు. స్పష్టమైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారని పేరున్న రాజన్‌ ఒక వెబినార్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. 

- శాసనపరమైన కొన్ని చర్యల ద్వారా కొన్ని విమర్శలకు ప్రభుత్వం మరింత ప్రతిస్పందించాలి.
- మెజారిటీవాదం వైపు ధోరణి అపారమైన ప్రతికూల పరిణామాలను కలిగి ఉంది. ఇది ప్రతి ఆర్థిక సూత్రానికి విరుద్ధం. 
- భారతదేశానికి అందరి భాగస్వామ్యం కలిగిన సమ్మిళిత వృద్ధి అవసరం. ఏదైనా ఒక  వర్గాన్ని రెండవ తరగతి పౌరులుగా చూస్తూ,  సమ్మిళిత వృద్ధిని సాధించలేము.  
- మెజారిటీవాదం ప్రజలను విభజిస్తుంది.  భారతదేశం కలిసి ఉండాల్సిన సమయంలో విభజన ఎంతమాత్రం మంచిదికాదు. ఇదే జరిగితే అంతర్జాతీయంగా దేశానికి బెదిరింపులు మరింత పెరుగుతాయి.  
- భారతదేశ ఎగుమతి విభాగం పనితీరు బాగానే ఉంది కానీ... అద్భుతం కాదు.  
- భారత్‌లో మహిళా కార్మిక భాగస్వామ్యం భారీగా పెరగాలి. 
- ప్రతి పరిణామాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుని, తగిన నిర్ణయాలతో ముందుకువెళ్లే ప్రభుత్వం అవసరం.  

గణాంకాల గురించి ఇలా... 
భారతదేశం నేడు బలమైన వృద్ధి గణాంకాలను కలిగి ఉంది.  అయితే వృద్ధి గణాంకాల పట్ల దేశం జాగ్రత్తగా ఉండాలి. క్షీణత తర్వాత లో బేస్‌తో నమోదయ్యే వృద్ధి గణాంకాల గురించి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరాదు. వాస్తవిక వృద్ధి ధోరణి ఎల్లప్పుడూ అవసరం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ ఎకానమీ వాస్తవంగా అంత అద్భుతంగా లేదు. బలమైన వృద్ధి గణాంకాలు ఉన్నప్పటికీ, అది మంచి ఉద్యోగావకాశాలను సృష్టించలేదు. ప్రస్తుతం పలు విభాగాల్లో మహమ్మారి కరోనా కన్నా వెనకడుగులోనే ఉన్నాము. గణాంకాలు వాస్తవింగా ఉండాలి. వాస్తవాలను దాచిపెట్టే విధంగా ఉండకూడదు.

చదవండి: ఆర్థిక శాఖ వింత సూత్రీకరణ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ధనవంతులే నష్టపోతున్నారట!

మరిన్ని వార్తలు