మొత్తం ఫారెక్స్లో బంగారం వాటా 6 శాతం
పరిమాణంలో 706 టన్నులు
విలువలో 37 బిలియన్ డాలర్లు
అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన పసిడి నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది. 2021 క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లో(జనవరి-జూన్) రికార్డు స్థాయిలో 29 టన్నులు కొనుగోలు చేసింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఆర్బీఐ పసిడి నిల్వలు 27 శాతం పెరగడం గమనార్హం. ఆర్బీఐ నిర్వహణలో ఉండే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా ఉండే పసిడి పరిమాణం 2021 జూన్ 30 నాటికి 705.6 టన్నులకు చేరింది. 2018 ప్రారంభంలో ఈ పరిమాణం 558.1 టన్నులు. (చదవండి: ఇక ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!)
ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్ నిల్వల్లో 2021 ఆగస్టు 27తో ముగిసే త్రైమాసికానికి పసిడి వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, ఆగస్టు 27వ తేదీతో ముగిసిన వారంలో(అంతక్రితం ఆగస్టు 22తో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 633.558 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.46 లక్షల కోట్లు) చేరాయి. ఇందులో పసిడి నిల్వల వాటా 37.441బిలియన్ డాలర్లు. ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చూస్తే..
ప్రయోజనాలు ఎన్నో..
సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వలపై మేము పరిశోధన చేశాం. ఇది ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూర్చే అంశం. ఇక్కడ మనం అంతర్జాతీయ తీవ్ర అనిశ్చిత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే దేశాల రుణ భారాలను పరిశీలించాలి. ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం వంటి ఎన్నో సమస్యలు ప్రపంచ దేశాల్లో కనిపిస్తాయి. ఆయా సమస్యల పరిష్కారాల్లో పసిడి నిల్వలు కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే ఆర్థిక సంక్షోభాల సమయంలో సావరిన్ క్రెడిట్ డిఫాల్డ్ స్వాప్ (సీడీఎస్) సమస్యలను అధిగమించడానికి బంగారం ఎంతగానో దోహదపడుతుంది. - ఐఐఎం, అహ్మదాబాద్ పరిశోధనా నివేదిక