RBI Rules in Telugu: ఖాతాదారులు ఎగిరి గంతేసే వార్త చెప్పిన ఆర్‌బిఐ.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!

14 May, 2023 17:21 IST|Sakshi

భారతదేశంలో దాదాపు చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందులో ఉద్యోగాలు చేసేవారు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా అందరూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంక్ దానికి ఫెనాల్టీ చార్జీలను విధిస్తుంది. ఈ విధానం బ్యాంక్ ఖాతాదారులకు తలనొప్పిగా మారిపోయింది. అయితే ఈ విధానానికి చరమగీతం పాడటానికి ఆర్‌బిఐ సన్నద్ధమైంది.

సేవింగ్ అకౌంట్‌లో బ్యాలన్స్ సున్నా ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు విధించే చార్జీలను నిలిపివేయాలని ఆర్‌బిఐ బ్యాంకులను కోరింది. గతంలోనే ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతినే పాటిస్తున్నాయి.

ఆర్‌బిఐ అందించిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత, కస్టమర్ తన ఉద్యోగాన్ని మార్చుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. అప్పుడు మునుపటి అకౌంట్ లావాదేవీలు దాదాపు నిలిచిపోతాయి. లావాదేవీలు నిలిచిపోయిన తరువాత బ్యాంక్ దానికి ఫెనాల్టీ విధిస్తుంది. అప్పుడు బ్యాలన్స్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ ఆ మొత్తాన్ని రికవరీ చేయనప్పటికీ.. ఒకవేళా అకౌంట్‌లోకి డబ్బు జమ చేసినప్పుడు చెలించాల్సిన మొత్తం ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది. దీని వల్ల వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంటుంది.

(ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!)

ఇదిలా ఉంటే 'హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్' మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయదని, అంతే కాకుండా మళ్ళీ ఆ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా డబ్బు వసూలు చేయదని చెబుతున్నారు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలో ఉన్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా కూడా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విధానాన్ని ఏదైనా బ్యాంక్ అనుసరించకపోతే లేదా మీ అకౌంట్ నెగెటివ్ బ్యాలెన్స్‌లోకి వెళ్తే దీనిపైన మీరు ఆర్‌బిఐకి పిర్యాదు చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీఅభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Source: RBI

మరిన్ని వార్తలు