ఎస్‌బీఐకు ఆర్బీఐ భారీ పెనాల్టీ! ఎంత? ఎందుకంటే..

27 Nov, 2021 10:29 IST|Sakshi

RBI Impose Penalty To SBI: భారతీయ బ్యాంకుల పెద్దన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు భారీ పెనాల్టీ విధించింది.  నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది.
 

రుణగ్రహీత కంపెనీల్లో ఆ కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉందన్న కారణంతో ఎస్బీఐకు ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949 సెక్షన్‌ 19 సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం.. నవంబర్‌ 26న ఈ పెనాల్టీ విధించింది. ఈ సెక్షన్‌ ప్రకారం.. ఏ బ్యాంక్‌ కూడా 30 శాతం కంటే ఎక్కువ పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ను కలిగి ఉండడానికి వీల్లేదు.

చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. కేరళ సర్కార్‌ అసంతృప్తి

ఈ మేరకు 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్‌బీఐ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఎస్‌బీఐకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది ఆర్బీఐ.

అయితే బ్యాంక్‌ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే షేర్‌ మార్కెట్‌లో ఎస్బీఐ నష్టాల బాటలో పయనిస్తోంది.

మరిన్ని వార్తలు