కొత్త ఏడాది నుండి కొత్త నిబంధనలు..బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు!

23 Dec, 2022 12:02 IST|Sakshi

త్వరలో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బ్యాంక్‌ లాకర్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త లాకర్‌ నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.  

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ మేరకు..లాకర్ల విషయంలో బ్యాంకులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించకూడదు. జనవరి 1, 2023 నాటికి ప్రస్తుతం లాకర్‌ను వినియోగిస్తున్న ఖాతాదారులు తమ లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయాలి. బ్యాంకులు ఐబిఎ రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని ఉపయోగించవచ్చు.  ఈ లాకర్‌ అగ్రిమెంట్స్‌ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి.

బ్యాంకులే హామీ
ఆర్‌బీఐ ఆగస్టు 8, 2021న లాకర్‌ల విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం, సురక్షితమైన డిపాజిట్ వాల్ట్‌లను ఉంచిన ప్రాంగణాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదే. ఒకవేళ అలసత్వం కారణంగా..బ్యాంకు లాకర్‌లో ఉన్న వినియోగదారుల విలువైన వస్తువులు పోతే.. అవి చెల్లించే బాధ్యత బ్యాంకులదే. అగ్నిప్రమాదాలు లేదా భవనం కూలిపోవడం వల్ల ఖజానాలో నిల్వ చేసిన విలువైన వస్తువులను దోచుకున్నా లేదా నాశనం చేసినా వినియోగదారులు బ్యాంకు ఛార్జీల కంటే 100 రెట్లు వరకు నష్టపరిహారం పొందవచ్చు.

లాకర్ గదులను పర్యవేక్షించడానికి బ్యాంకులు సీసీటీవీని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో పాటు 180 రోజుల పాటు సీసీటీవీ డేటాను ఉంచాలని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో డిస్‌ప్లే బోర్డుపై సమాచారం అందించడం ద్వారా బ్యాంకుల్లో లాకర్‌లు ఉన్నాయనే విషయంలో వినియోగదారులకు తెలుస్తుందని ఆర్‌బీఐ గుర్తించింది. అందుకే ఖాళీ లాకర్ల జాబితా, లాకర్ కోసం వెయిటింగ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ లోని నంబర్ గురించి వినియోగదారులకు తెలిసేలా డిస్‌ప్లే బోర్డ్‌లపై సమాచారం ఇవ్వాలి.  

ఎస్‌ఎంఎస్‌ అలెర్ట్‌ 
మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి, కస్టమర్ తన లాకర్‌ను యాక్సెస్ చేసిన ప్రతిసారీ సంబంధిత బ్యాంకులు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్ పంపాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ అలర్ట్ కస్టమర్లు మోలా భారిన పడకుండా సంరక్షిస్తుంది. 

లాకర్ అద్దె
మూడేళ్ల పాటు అద్దెగా తీసుకునే లాకర్‌పై వినియోగదారులకు బ్యాంకులకు టర్మ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్‌లు ఎగ్జిస్టింగ్‌ కస్టమర్లకు అవసరలేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు