ప్రభుత్వ బాండ్లలో ‘రిటైల్‌’ పెంపుపై ఆర్‌బీఐ దృష్టి

5 Jan, 2022 06:22 IST|Sakshi

మార్కెట్‌ మేకింగ్‌ స్కీమ్‌ నోటిఫై  

ముంబై: ప్రభుత్వ బాండ్లలో రిటైల్‌ భాగస్వామ్యం పెంపు లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రత్యేకంగా మార్కెట్‌ మేకింగ్‌ స్కీమ్‌ను నోటిఫై చేసింది. ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ కింద సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకానికి వీలుగా రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ (ఆర్‌డీజీ) ఖాతాదారులకు ధరలు/కోట్‌లను అందించడం ఈ స్కీమ్‌ లక్ష్యం. తాజా మార్కెట్‌ మేకింగ్‌ స్కీమ్‌ కింద ప్రైమరీ డీలర్స్‌ మార్కెట్‌ సమయాల్లో ఎన్‌డీఎస్‌–వోఎం ప్లాట్‌ఫామ్స్‌లో సెకండరీ మార్కెట్‌కు సంబంధించి రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ ఖాతాదారుల కొనుగోలు/అమ్మకం అభ్యర్థనలు, లావాదేవీల ప్రక్రియను సులభతరం చేస్తారు. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ కింద చేసిన ఆర్‌డీజీ ఖాతాదారుల నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) ధృవీకరణపై ప్రాథమిక డీలర్‌లు ఆధారపడతారు.‘‘‘ఎన్‌డీఎస్‌–వోఎం రిక్వస్ట్‌ ఫర్‌ కోట్‌  ఖఊఖ విభాగంలో ఆర్‌డీజీ ఖాతాదారులతో లావాదేవీలు చేయడానికి తదుపరి కేవైసీ ధృవీకరణ అవసరం లేదు’’ అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.   

నేరుగా కొనుగోళ్లు...
రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్‌ 12వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌ కింద వ్యక్తులు నేరుగా ట్రెజరీ బిల్లులు, డేటెడ్‌ సెక్యూరిటీలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌) ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ నుండి నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యతను ఈ స్కీమ్‌ కల్పిస్తోంది.  https:// rbiretaildirect. org. inలో ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ఇందుకు వేదికగా ఉంది. ఈ స్కీమ్‌ కింద రిటైల్‌ ఇన్వెస్టర్లు (వ్యక్తిగతంగా) ఆన్‌లైన్‌ రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ (ఆర్‌డీజీ అకౌంట్‌)ను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్లను ప్రత్యక్షంగా తమ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లకు అనుసంధానించవచ్చు.

ఎన్‌డీఎస్‌–వోఎం సంగతి ఇదీ...
స్క్రీన్‌ ఆధారిత ఎన్‌డీఎస్‌–వోఎం ద్వారా సెకండరీ మార్కెట్‌ ఆపరేషన్స్, ప్రభుత్వ సెక్యూరిటీల జారీ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వ్యక్తిగత ఆర్‌డీజీ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఎన్‌డీఎస్‌–వోఎం అనేది ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి సెకండరీ మార్కెట్‌ ట్రేడింగ్‌ కోసం ఉద్దేశించిన ఒక స్క్రీన్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ. ఆర్‌బీఐ నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకూ ఇది బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా ద్వారా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు.

ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్‌ ఫ్రీ టెలిఫోన్‌ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా), ఈమెయిల్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవని ఆర్‌బీఐ తెలిపింది. దేశీయంగా సేవింగ్స్‌ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్‌ ఐడీ, రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుతో రిటైల్‌ ఇన్వెస్టర్లు నమోదు చేయించుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్‌ రోజున ఆర్‌డీజీ ఖాతాలోకి జమవుతాయి.    

మరిన్ని వార్తలు