ఏఆర్‌సీ నిబంధనలు కఠినతరం

12 Oct, 2022 08:18 IST|Sakshi

ముంబై: మొండి రుణాల నిర్వహణలో కీలకపాత్ర పోషించే సెక్యూరిటైజేషన్‌ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల (ఏఆర్‌సీ) నిబంధనలను రిజర్వ్‌ బ్యాంక్‌ కఠినతరం చేసింది. కనీస మూలధన (ఎన్‌వోఎఫ్‌) పరిమితిని రూ. 100 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచింది. 

ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఏఆర్‌సీలు సదరు నిబంధనలకు అనుగుణంగా నిధులను సమకూర్చుకు నేందుకు 2026 ఏప్రిల్‌ వరకూ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఈ మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సర్క్యులర్‌ చేసిన తేదీ తర్వాత నుంచి ఏఆర్‌సీ కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలు తప్పనిసరిగా రూ. 300 కోట్ల ఎన్‌వోఎఫ్‌ నిబంధన పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. 

మరోవైపు, పునర్‌వ్యవస్థీకరణ ద్వారా రుణగ్రహీతల అప్పుల సెటిల్మెంట్‌ నిబంధనను కూడా మార్చింది. ఆయా ప్రతిపాదనలను స్వతంత్ర సలహాదార్ల కమిటీ (ఐఏసీ) పరిశీలించిన మీదటే బాకీల సెటిల్మెంట్‌ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ కమిటీలో టెక్నిక ల్, ఆర్థిక, లీగల్‌ నేపథ్యం గల నిపుణులు ఉంటారు.   

మరిన్ని వార్తలు