విదేశాల్లో మనోళ్ల పెట్టుబడులు తగ్గాయ్‌

11 Mar, 2022 08:31 IST|Sakshi

 ఫిబ్రవరిలో 67 శాతం డౌన్‌ 

 75.36 కోట్ల డాలర్లకు పరిమితం  

ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశాలలో దేశీ కార్పొరేట్ల పెట్టుబడులు 67 శాతం క్షీణించాయి. 75.36 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు విదేశాలలోని వెంచర్లలో 2021 ఫిబ్రవరిలో 228 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. విదేశాలలో ప్రత్యక్ష పెట్టుబడుల(ఓఎఫ్‌డీఐ) విభాగంలో గత నెలలో ఈక్విటీ రూపేణా 23.78 కోట్ల డాలర్లు, రుణాలుగా 23 కోట్ల డాలర్లు, గ్యారంటీల కింద 28.57 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. కాగా.. నెలవారీ చూస్తే అంటే 2022 జనవరిలో నమోదైన 171 కోట్ల డాలర్ల ఓఎఫ్‌డీఐలతో పోలిస్తే ఫిబ్రవరిలో 56 శాతం వెనకడుగు వేశాయి. 

ఈ పెట్టుబడుల్లో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్‌ 4.7 కోట్ల డాలర్లతో అగ్రపథాన నిలవగా.. మధురిమ ఇంటర్నేషనల్‌ 4.09 కోట్ల డాలర్లతో తదుపరి ర్యాంకును పొందింది. రష్యన్‌ జేవీలో ఓఎన్‌జీసీ విదేశ్‌ ఇన్వెస్ట్‌ చేయగా.. యూఎస్‌ జేవీలో మధురిమ పెట్టుబడులకు దిగింది. ఈ బాటలో టాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ యూఏఈలో 2.95 కోట్ల డాలర్లు, సింగపూర్‌ అనుబంధ సంస్థలో ఇమేజిన్‌ మార్కెటింగ్‌ 2.60 కోట్ల డాలర్లు, సౌదీ అరేబియన్‌ జేవీలో కేఈసీ ఇంటర్నేషనల్‌ 1.6 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. 

చదవండి: స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు: ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు