మార్కెట్‌లోకి రూ.20 నాణేలు 

31 Mar, 2021 13:18 IST|Sakshi

సుభాష్‌నగర్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) గతంలో విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.1 నుంచి 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. 2020లో విడుదలైన రూ.20 నాణేలు తాజాగా మార్కెట్‌లో చలామణిలోకి రావడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. 

బడ్జెట్‌ ప్రసంగానికి కరెంటు కష్టం
కోల్‌సిటీ (రామగుండం): విద్యుత్‌ సరఫరాలో సమస్యలతో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో బడ్జెట్‌ సమావేశానికి అంతరాయం ఏర్పడింది. సమావేశం మధ్యలో ఏకంగా మూడుసార్లు కరెంటు పోవడంతో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులోనే నిర్వహించాల్సి వచ్చింది. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్‌ హాల్‌లో మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం బడ్జెట్‌ సమావేశం జరిగింది. సమావేశం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉన్నప్పటికీ విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు.

సమావేశంలో మేయర్‌ బడ్జెట్‌ సందేశం చదువుతుండగా కరెంటు మళ్లీ పోయింది. దీంతో సిబ్బంది సెల్‌ఫోన్‌ల ఫ్లాష్‌ లైట్లు ఆన్‌చేయడంతో మేయర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. సభకు హాజరైన కార్పొ రేటర్లు కూడా మొబైల్‌ ఫోన్ల వెలుగులోనే రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. మల్యాలపల్లి సమీపంలోని 33 కేవీ విద్యుత్‌ వైర్లలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ విద్యుత్‌ సమస్యకు కారణమైనప్పటికీ.. కార్పొరేషన్‌ కార్యాలయంలో జనరేటర్‌ సౌకర్యం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

చదవండి: ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్‌బీఐ
బుల్ మళ్లీ రంకెలేసింది..

>
మరిన్ని వార్తలు