ఆన్‌లైన్‌ ఆటోమేటిక్‌ పేమెంట్స్‌: ఇకపై ఆ వివరాలు ఎంటర్‌ చేయాలి.. లేకుంటే పేమెంట్‌ జరగదు!

2 Dec, 2021 10:25 IST|Sakshi

Online Payments Google will NOT save your card details from 2022: స్మార్ట్‌ ఫోన్‌, ఇతర డివైజ్‌ల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్‌ ముఖ్య గమనిక చేసింది. అదీ గూగుల్‌ బేస్డ్‌ మంత్లీ పేమెంట్‌లు చేసేవాళ్లకు. జనవరి 1,2022 నుంచి కస్టమర్‌ కార్డు వివరాలు సేవ్‌ చేయబోమని వెల్లడించింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌, క్రెడిట్‌ కార్డ్‌, ఏటీఎం చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.


సాధారణంగా ఒక్కసారి పేమెంట్‌ చేశాక..  మంత్లీ పేమెంట్‌లు చేసే టైంలో కార్డు నెంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ వివరాలతో యూజర్‌ అవసరానికి తగ్గట్లు ఆటోమేటిక్‌గా పేమెంట్‌ కూడా జరిగిపోతుంటుంది.  అయితే ఇకపై గూగుల్‌ సంబంధిత యాప్స్‌ విషయంలో ఇలాంటి ఫార్మట్‌ కనిపించదని  పేర్కొంది గూగుల్‌.  

ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్‌ రెగ్యులేషన్స్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. పేమెంట్‌ అగ్రిగ్రేటర్స్‌(PA), పేమెంట్‌ గేట్‌వేస్‌(PG) కొరకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకం జారీ చేసింది.  ఆర్బీఐ సర్క్యులర్‌ ప్రకారం.. కార్డ్‌ జారీచేసినవాళ్లు, సంబంధిత నెట్‌వర్స్క్‌ తప్ప కార్డు వివరాల్ని(Card-on-File) ఇతర ప్లాట్‌ఫామ్స్‌ ఏవీ సేకరించడానికి వీల్లేదు. 

గూగుల్‌ ప్లే అకౌంట్‌, గూగుల్‌ వర్క్‌ అకౌంట్‌, చివరికి గూగుల్‌క్లౌడ్‌లో రికార్డయిన వివరాలు సైతం పని చేయవు. కాబట్టి, వచ్చే ఏడాదిలోనూ అదే కార్డును ఉపయోగించుకోవాలనుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాల్ని రీఎంటర్‌ చేయాల్సి ఉంటుందని గూగుల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. లేనిపక్షంలో పేమెంట్‌లు క్యాన్సిల్‌, డిక్లయిన్‌ అవుతాయని స్పష్టం చేసింది. అయితే మన దేశంలో ఎక్కువ మంది కార్డు పేమెంట్ల ద్వారా ఎక్కువగా ఉపయోగించేది వీసా, మాస్టర్‌కార్డులే. వీటి విషయంలో మాత్రం ఊరట ఇచ్చే విషయం చెప్పింది గూగుల్‌.

వీసా, మాస్టర్‌ కార్డు సంబంధిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్స్‌ చేయాలనుకుంటే.. డిసెంబర్‌ 31,2021లోపు కార్డు వివరాల్ని రీ-ఎంటర్‌ చేయాలని, తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు లేదా పేమెంట్‌ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించవని, కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి పేమెంట్లు చేసే టైంలో మళ్లీ ఆ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రూపే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డిస్కవర్‌, డైనర్స్‌ కార్డ్‌ వినియోగదారులు మాత్రం స్టోర్‌ కావని, పేమెంట్‌ చేసిన ప్రతీసారి వివరాలు సమర్పించాల్సిందేనని పేర్కొంది. 

చదవండి: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..!

మరిన్ని వార్తలు