ఆర్‌బీఎల్‌ బ్యాంకు లాభం రూ.197 కోట్లు

13 May, 2022 08:18 IST|Sakshi

ముంబై: ఆర్‌బీఎల్‌ బ్యాంకు మార్చి త్రైమాసికానికి రూ.197 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభం రూ.75 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 25 శాతం పెరిగి రూ.1,131 కోట్లకు చేరింది. రుణాల్లో వృద్ధి 2 శాతమే నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 5.04 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 7 శాతం క్షీణించి రూ.511 కోట్లకు పరిమితమైంది. బ్యాంకు బ్యాలన్స్‌ షీట్‌ 20 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు ఆర్‌బీఎల్‌ బ్యాంకు తాత్కాలిక సీఈవో, ఎండీ రాజీవ్‌ అహుజా తెలిపారు.

స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) 2021 డిసెంబర్‌ త్రైమాసికం నాటికి ఉన్న 4.84 శాతం నుంచి 2022 మార్చి చివరికి 4.40 శాతానికి దిగొచ్చాయి. ఎన్‌పీఏల కోసం రూ.401 కోట్లను పక్కన పెట్టింది. క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో 16.82 శాతానికి చేరింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఎల్‌ బ్యాంకు రూ.75 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2020–21లో బ్యాంకు రూ.508 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.  

చదవండి: సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు

మరిన్ని వార్తలు