Ratan TATA: మన పిల్లలేమీ శాండ్‌విచ్‌లు కాదు - రతన్‌టాటా

12 May, 2022 13:15 IST|Sakshi

దేశంలో పారిశ్రామికవేత్తలు ఎందరున్నా.. వారిలో టాటాలది ప్రత్యేక స్థానం. వ్యాపారానికి హ్యుమన్‌టచ్‌ జోడించడమనేది ఆది నుంచి టాటాలకు ఉన్న అలవాటు. అదే ఒరవడిలో మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న బాధలను తీర్చేందుకు నడుం బిగించారు టాటా గ్రూపు చైర్మన్‌ రతన్‌టాటా. ఈ ప్రయత్నాల్లో నుంచి మార్కెట్‌లోకి వచ్చిందే టాటా నానో కారు.

ఇదే కారణం
టాటా నానో కారు రూపొందించాలన్న ఐడియా మదిలో ఎందుకు వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు తాను ఎటువంటి శ్రమ చేశాననే విషయాలను ఇన్‌స్టా స్టోరీ ద్వారా రతన్‌ టాటా ఈ రోజు స్వయంగా తెలిపారు. ఇండియాలో మధ్య తరగతి ప్రజలు సాధారణంగా స్కూటర్లపై ప్రయాణం చేస్తుంటారు. ఇందులో ఒకేసారి స్కూటర్‌ మీద కుటుంబం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటారు. పిల్లలయితే శాండ్‌విచ్‌ల మాదిరి తల్లిదంద్రుల మధ్య నలిగిపోతూ ఉంటారు. గుంతలు ఉండే రోడ్లపై ఇలా ప్రయాణించం ఎంత ప్రమాదకరమో కదా అనిపించేంది. వీళ్లకు ఈ కష్టాలు దూరం చేసేందుకు నేనైమా చేయగలనా అని ఆలోచించాను.

A post shared by Ratan Tata (@ratantata)

బగ్గీ నుంచి నానో
ఆర్కిటెక్ట్‌ స్టూడెంట్‌ అవడం వలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా రఫ్‌ డ్రాయింగ్‌ వేసుకోవడం అలవాటు. అలా స్కూటర్‌ ప్రమాదరహితంగా మారాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ రెండు చక్రాల స్కూటర్‌ను నాలుగు చక్రాలు చేశాను. అప్పుడు దాన్ని పరిశీలిస్తే కిటీకీలు కూడా లేకుండా ఓ సాధారణ బగ్గీలా అనిపిచింది. ఆ డిజైన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తే.. అదే నానోకు ప్రాణం పోసింది. కేవలం లక్ష రూపాయలకే సామాన్యులకు కారు అందివ్వాలనే లక్ష్యంతో ‘నానో’ ప్రాజెక్టును అమలు చేశారు రతన్‌ టాటా.

వర్షంలో తడుస్తూనే
అంతకు ముందు ఓసారి ముంబైలో జరిగిన సమావేశంలో నానో విషయంలో సీరియస్‌నెస్‌ పెరగడానికి కారణం వివరించారు రతన్‌టాటా. ముంబైలో ఓసారి తాను కారులో వెళ్తుండగా జోరుగా వర్షం కురుస్తోంది. అంతటి వర్షంలోనూ పిల్లలతో కలిసి భార్యభర్తలు టూవీలర్‌పై ప్రయాణం చేయడం కంటపడింది. అంతే ఇలాంటి కష్టాలు నా దేశ ప్రజలకు దూరం చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను అని టాటా తెలిపారు.

చదవండి: 'ఫోర్డ్‌' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్‌ టాటా!

మరిన్ని వార్తలు