2021లో రియల్‌మీ కీలక ఫోన్‌- కేవోఐ 

26 Dec, 2020 13:38 IST|Sakshi

చైనా, జపాన్‌లలో పేరొందిన కేవోఐ చేప పేరుతో స్మార్ట్‌ ఫోన్‌

888 స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌- 12 జీబీ ర్యామ్- 256 జీబీ మెమొరీ

కనీసం మూడు సెన్సర్లు- 64 ఎంపీ లెన్స్‌తో ప్రధాన కెమెరా

ముంబై, సాక్షి: కొత్త ఏడాది(2021)లో చైనీస్‌ కంపెనీ రియల్‌మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కేవోఐగా నామకరణం చేసిన ఈ ఫోన్‌ను ప్రధాన బ్రాండుగా విడుదల చేసే వీలుంది. చైనా, జపాన్‌లలో సుప్రసిద్ధమైన కేవోఐ చేప పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. శుభప్రదంగా భావించే కేవోఐ చేపను పోలి విభిన్న కలర్స్‌, అందమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల కంపెనీ మోటో.. డేర్‌ టు లీప్‌ రైటప్‌తోపాటు.. రెండు కోయి చేపలతో అలంకరించిన పోస్టర్‌ను రియల్‌మీ విడుదల చేసినట్లు వెల్లడించాయి. (రియల్‌మీ నుంచి స్మార్ట్‌ వాచీలు రెడీ)

ఫీచర్స్‌ ఇలా!
ఫ్లాగ్‌షిప్‌ బ్రాండుగా 2021లో రియల్‌మీ తీసుకురానున్న కేవోఐ స్మార్ట్‌ ఫోన్‌ ఫిబ్రవరికల్లా మార్కెట్లో ప్రవేశించవచ్చని టెక్‌ నిపుణుల అంచనా. ఫోన్ ఫీచర్స్‌ పూర్తిగా వెల్లడికానప్పటికీ వెనుకభాగంలో చతురస్రాకారంలో కనీసం మూడు సెన్సర్స్‌తో కూడిన 64 ఎంపీ లెన్స్‌ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఫ్లాస్క్‌ షేపుతో మూడు రంగుల కలయికతో కోత్త ప్యాటర్న్‌లో వెనుక కవర్‌ ఉండవచ్చని చెబుతున్నారు. డిస్‌ప్లేలోనే ఫింగర్‌ ప్రింట్‌ ఏర్పాటుకానుంది. స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తోపాటు.. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ అంతర్గత మెమొరీకి చాన్స్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తో ఫోన్‌ విడుదల కావచ్చు. ఇతర వివరాలు వెల్లడికావలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు