ఇక టెలివిజనూ.. వైర్‌లెస్

17 Jan, 2021 15:15 IST|Sakshi

ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల చార్జింగ్‌ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్‌లెస్‌ టెక్నాలజీ... ఇప్పుడు టెలివిజన్లకు విస్తరించనుంది. రష్యాకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేబుల్‌కు బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్‌ సరఫరా చేయడం ద్వారా ఇది పనిచేయనుంది. రెజొనెన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీని సీఈఎస్‌ 2021లో ప్రదర్శించారు. కేబుల్స్‌కు బదులు వైఫై పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని అందుకునే రిసెప్షన్‌ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. (చదవండి: 5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!

విద్యుత్తు సాకెట్‌కు దూరంగా టీవీని ఏర్పాటు చేసుకోవడం అసాధ్యమైన ఈ నేపథ్యంలో రెజొనెన్స్‌ ఈ వైర్‌లెస్‌ టీవీని తీసుకొచ్చింది. వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుత్తును అందుకునే రిసీవర్‌. కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని కంపెనీ వివరించింది. కనీసం మీటర్‌ దూరం వరకూ విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్‌ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. రిసీవర్‌ కాయిల్‌ను టెలివిజన్‌ఫ్రేమ్‌లోకే చేరవచ్చని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్‌ అడుగు భాగంలో కానీ.. గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఏడాది క్రితం సామ్‌సంగ్‌ కూడా ఇలాంటి వైర్‌లెస్‌ టీవీని తెచ్చే ప్రయత్నం చేసినా... తగిన టెక్నాలజీ లేదని తన ప్రయత్నాలను విరమించుకుంది. రెజొనెన్స్‌ తన టెక్నాలజీపై అమెరికాతో పాటు ఇండియా, యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, దక్షిణ కొరియాల్లోనూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ టెక్నాలజీని టెలివిజన్లకు మాత్రమే కాకుండా... ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్‌ ఉపకరణాలతోపాటు విద్యుత్తు వాహనాలకూ వాడొచ్చని కంపెనీ చెబుతోంది.

మరిన్ని వార్తలు