రిలయన్స్‌ చేతికి లోటస్‌ చాకొలేట్‌

30 Dec, 2022 08:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చాకొలేట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన లోటస్‌ చాకొలేట్‌ కంపెనీలో రిలయన్స్‌ కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ 51 శాతం వాటా తీసుకోనుంది. అలాగే మరో 26 శాతం వరకు వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనున్నట్టు రిలయన్స్‌ గురువారం వెల్లడించింది. 

లోటస్‌ ప్రమోటర్లు ప్రకాశ్‌ పి పాయ్, అనంత్‌ పి పాయ్, ఇతరులతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. 51 శాతం వాటాకు సమానమైన 65,48,935 షేర్లను ఒక్కొక్కటి రూ.113 చొప్పున మొత్తం రూ.74 కోట్లు చెల్లించి దక్కించుకోనున్నట్టు రిలయన్స్‌ ప్రకటించింది. రిలయన్స్‌ కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్, లోటస్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు రూ.10 ముఖ విలువ కలిగిన 5,07,93,200 నాన్‌ క్యుములేటివ్‌ రెడీమేబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటాయి. వీటి ద్వారా వచ్చే నిధులను కంపెనీ వృద్ధికి వినియోగించనున్నారు.

 ప్రముఖ సినీ నటి టి.శారద, ఇంజనీర్‌ ఎన్‌.విజయరాఘవన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సమీపంలోని దౌలతాబాద్‌ వద్ద కోకో ప్రాసెసింగ్, చాకొలేట్‌ తయారీ కేంద్రం 1992లో ప్రారంభం అయింది. ఈ కంపెనీ 2008లో పజ్జొలానా గ్రూప్‌ పరమైంది. 


 

మరిన్ని వార్తలు