Reliance: దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్‌ టీమ్‌పై రిలయన్స్‌ కన్ను!

21 Jul, 2022 07:09 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. క్రికెట్‌ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన టీ20 లీగ్‌ టీమ్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ ముంబై ఇండియన్స్‌ టీమ్‌ బ్రాండ్‌ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని పేర్కొంది. 

యూఏఈ టీ20 లీగ్‌లో కూడా ఒక టీమ్‌ను దక్కించుకుంటున్నట్లు రిలయన్స్‌ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీని కూడా కలిపితే మూడు దేశాల్లో తమకు టీ20 టీమ్‌లు ఉన్నట్లవుతుందని రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.  

జియో ఇనిస్టిట్యూట్‌ ప్రారంభం.. 
రిలయన్స్‌ ఏర్పాటు చేసిన జియో ఇనిస్టిట్యూట్‌లో తొలి బ్యాచ్‌కు తరగతులు ప్రారంభమయ్యాయి. దేశీయంగా అత్యుత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. 

ముంబై శివార్లలో 800 ఎకరాల విస్తీర్ణంలో జియో ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటైంది. దీని కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ. 1,500 కోట్లు వెచ్చించింది. అంతర్జాతీయంగా పేరొందిన మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ మొదలైన వాటితో జియో ఇనిస్టిట్యూట్‌ భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు