కేవలం రూ.2500కే జియో 5జీ ఫోన్

3 Jun, 2021 16:43 IST|Sakshi

రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్దం అవుతుంది. రిలయన్స్ జియో మార్కెట్లో ఉన్న 5జీ మొబైల్స్ కంటే అతి తక్కువ ధరకే తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అత్యంత చౌక ధరకే 5జీ ఫోన్‌ను తీసుకొని రావడానికి ప్లాన్ చేస్తుంది. జూన్ 24న జరిగే వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్ జియో 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలని చూస్తుంది. రిలయన్స్ తీసుకొని రాబోయే 5జీ మొబైల్ ధర రూ.2,500-రూ.5,000 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం 2జీ ఫోన్ వాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ ఫోన్ తీసుకురాబోతోంది. 20-30 కోట్ల మంది యూజర్లకు చేరువకావడానికి జియో ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.20,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. మన దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులో లేకున్నప్పటికి 5జీ మొబైల్స్ కొనే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే జూన్ 24న జరిగే సమావేశంలో జియోబుక్ అని పిలవబడే సరసమైన ల్యాప్‌టాప్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ మీద పనిచేయనుంది. 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి కూడా విలువైన సమాచారం పంచుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 44వ వార్షిక వాటాదారుల సమావేశంలో జియో మరో సంచలనం క్రియేట్ చేయబోతున్నది అని తెలుస్తుంది.

చదవండి: వాట్సాప్ పై కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు