ఏపీలో రీసైక్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న రిలయన్స్‌

4 Aug, 2021 19:50 IST|Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వాటర్‌ బాటిళ్లకు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులకు వాడే  పాలిథిలిన్ టెరాఫ్తలెట్(PET) రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బుధవారం (ఆగస్టు 4) రోజున ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రీసైకిల్‌ పాలిస్టర్‌ స్టేపుల్‌ ఫైబర్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా, ఆర్‌ఐఎల్‌ కోసం ప్రత్యేకంగా రీసైకిల్ చేసిన పీఎస్‌ఎఫ్‌-రెక్రాన్ గ్రీన్ గోల్డ్, పెట్‌ ఫ్లాక్స్ వాష్-లైన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనుంది. అంతేకాకుండా తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ఆపరేట్‌ చేయనుందని రిలయన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  తన రీసైక్లింగ్ సామర్ధ్యాన్ని రెండింతలకు పెంచాలని భావిస్తోంది. 5 బిలియన్ పోస్ట్-కన్స్యూమర్ పెట్‌ బాటిళ్లను రీసైక్లింగ్‌ చేయడంతో దేశవ్యాప్తంగా 90శాతం రీసైక్లింగ్ రేటును సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. రిలయన్స్‌ పెట్రో కెమికల్స్‌ సీవోవో  విపుల్‌ షా మాట్లాడుతూ..  రిలయన్స్‌ పెట్‌ బాటిళ్ల రీసైక్లింగ్‌ విస్తరణ అనేది రిలయన్స్‌ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీ దృష్టిలో భాగంగా ఉందన్నారు. శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా సంస్థకు తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో, నిర్వహించడంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తన మద్దతును తెలుపుతుందని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు