ముఖేష్‌ అంబానీ చేతికి మరో దిగ్గజ సంస్థ, 80శాతం వాటా కొనుగోలు!

21 Mar, 2022 07:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రీమియం లోదుస్తుల రిటైల్‌ సంస్థ క్లోవియాలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. క్లోవియా మాతృసంస్థ పర్పుల్‌ పాండ్‌ ఫ్యాషన్స్‌లో 89 శాతం వాటాలను రూ. 950 కోట్లకు దక్కించుకుంది. మిగతా వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్‌మెంట్‌ దగ్గర ఉంటుంది.

రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. ఇప్పటికే జివామె, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్‌ఆర్‌వీఎల్‌కు తాజాగా క్లోవియా కొనుగోలుతో .. ఇన్నర్‌ వేర్‌ సెగ్మెంట్‌లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడం సాధ్యపడనుంది. పంకజ్‌ వెర్మాని, నేహా కాంత్, సుమన్‌ చౌదరి కలిసి 2013లో క్లోవియాను ప్రారంభించారు.

వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే క్లోవియా బ్రాండ్‌ను కూడా తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చామని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు. రిలయన్స్‌ భారీతనం, రిటైల్‌ అనుభవంతో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించగలమని క్లోవియా వ్యవస్థాపకుడు, సీఈవో పంకజ్‌ వెర్మాని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు