Reliance Jio: రిలయన్స్‌ జియో సంచలన నిర్ణయం..!

8 Jan, 2022 15:02 IST|Sakshi

భారత టెలికాం రంగ ముఖచిత్రాన్ని మార్చివేసిన రిలయన్స్‌ జియో మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. రిలయన్స్‌ జియో ఐపీవో దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  

7.5 లక్షల కోట్ల సమీకరణ..!
ఈ ఏడాదిలో రిలయన్స్‌ జియో ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ ఫైనాన్షియల్ రీసెర్చ్ ఏజెన్సీ సీఎల్ఎస్ఏ ఒ‍క నోట్‌ను విడుదల చేసింది.ఈ ఐపీవో ద్వారా 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు) మేర నిధులను సమీకరించేందుకు రిలయన్స్‌ జియో సిద్దమవుతున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

సపరేట్‌గా ఐపీవో..!
టెక్‌ దిగ్గజ కంపెనీలు గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు రిలయన్స్‌ జియోతో జత కట్టాయి. వేర్వేరు కంపెనీలకు  33 శాతం కంపెనీ వాటాలను వేర్వేరు కంపెనీలకు ముఖేష్ అంబానీ విక్రయించారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 10 శాతం, గూగుల్ 8 శాతం మేర రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఇంటెల్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్‌తో పాటు టాప్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ కూడా రిలయన్స్‌ జియోలో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలు జియోలో భారీగా ఇన్వెస్ట్‌ చేశాయి. వీటి  విలువ సుమారు 1.52 లక్షల కోట్ల రూపాయలు. కా ఆయా కంపెనీలకు వాటాలు ఉన్నందున సపరేట్ లిస్టింగ్ చేయాలని రిలయన్స్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సీఎల్ఎస్ఏ పేర్కొంది. ఏడున్నర లక్షల కోట్ల రూపాయల మేర విలువ గల పబ్లిక్ ఇష్యూను రిలయన్స్ జియో జారీ చేస్తే.. ఇదే బిగ్గెస్ట్ ఐపీఓగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆర్‌ఐఎల్‌కు భారీ నిధులు

మరిన్ని వార్తలు