తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిన జియో ప్రాబల్యం

28 Sep, 2020 19:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కోరుకునే మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా రిలయన్స్‌ జియో కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో ఏపీ టెలికాం సర్కిల్‌లో రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌లో 1.46 లక్షలకు పైగా నూతన మొబైల్‌ సబ్‌స్క్కైబర్లు చేరారు. ట్రాయ్‌ వెల్లడించిన టెలికాం సబ్‌స్ర్కైబర్‌ డేటా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలతో కూడిన ఉమ్మడి ఏపీ టెలికాం సర్కిల్‌లో జూన్‌లో చేరిన నూతన సబ్‌స్క్కైబర్లతో మొత్తం జియో మొబైల్‌ సబ్‌స్క్కైబర్ల సంఖ్య 3.10 కోట్లు దాటింది. ఈ సమయంలో అన్ని ఇతర టెలికాం ఆపరేటర్ల సబ్‌స్క్రైబర్‌ బేస్‌ తగ్గుముఖం పట్టగా జియో సబ్‌స్క్కైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో వొడాఫోన్‌ ఐడియా 3 లక్షల మందికి పైకి సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ఎయిర్‌టెల్‌ 68,411, బీఎస్‌ఎన్‌ఎల్‌ 31,954 మందిని కోల్పోయిందని ట్రాయ్‌ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. చదవండి : రిలయన్స్ జియో చేతికి పబ్‌జీ

ఇక ఈ ఏడాది జూన్‌లో 45 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లతో మొత్తం 39.72 కోట్ల సబ్‌స్క్కైబర్‌ బేస్‌తో జాతీయ మార్కెట్‌లోనూ జియో తన ప్రాబల్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. వొడాఫోన్‌ ఐడియా ఇదే నెలలో వరుసగా ఎనిమిదో నెలలోనూ 48 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 17 లక్షల కస్టమర్లను, భారతి ఎయిర్‌టెల్‌ 11 లక్షల సబ్‌స్ర్కైబర్లనూ కోల్పోయాయి. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 34.8 శాతం మార్కెట్‌ వాటాతో రిలయన్స్‌ జియో దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించగా, 27.8 శాతం మార్కెట్‌ వాటాతో ఎయిర్‌టెల్‌, 26.8 శాతం వాటాతో వొడాఫోన్‌ ఐడియాలు ఆ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు