-

ఎంఎస్‌ఎంఈలు కోలుకుంటేనే గ్రామీణ ఉపాధికి జోరు

21 Sep, 2021 14:23 IST|Sakshi

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు.. కరోనా మహమ్మారి దెబ్బ నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కోలుకోవాల్సి ఉంటుందని దేశంలోని మెజారిటీ కంపెనీలు (57 శాతం) అభిప్రాయపడుతున్నాయి.

జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ‘గ్రామీణ నిరుద్యోగం ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?’ అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినడం అన్ని రంగాలపైనా ప్రభావం పడేలా చేసిందని, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగం ఎక్కువ ప్రభావాన్ని చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడమే నిరుద్యోగం పెరిగేందుకు కారణమని ఈ సంస్థ సర్వేలో ఎక్కువ మంది చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 10 మధ్య 1,100 కంపెనీల అధిపతుల అభిప్రాయాలను సమీకరించింది. గ్రామీణ నిరుద్యోగం పెరగడానికి లాక్‌డౌన్‌ ఆంక్షలు కారణమని 14.3 శాతం మంది చెప్పగా.. కరోనా కేసులు పెరగడం కారణమని మరో 14.3 శాతం మంది పేర్కొన్నారు. మిగిలిన వారు ఈ కారణాలన్నీ నిరుద్యోగం పెరగడానికి దారితీసినట్టు చెప్పారు.   

మరిన్ని వార్తలు