మార్చి 31లోగా ఈ పనులను వెంటనే పూర్తి చేయండి!

19 Mar, 2021 17:57 IST|Sakshi

కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు జరగనున్నాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి.  వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రింద తెలిపిన పనులను మార్చి 31వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

పాన్ - ఆధార్ లింక్
పాన్ కార్డు - ఆధార్ కార్డును లింకు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ఈసారి పాన్-ఆధార్ లింక్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించబడింది. ఈలోగా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఐటీఆర్‌ ఫైలింగ్‌
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున, వీలైనంత త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేస్తే రూ.10,000 ఆలస్య రుసుము వసూలు చేయబడుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి. కాబట్టి మార్చి 31లోగా మీ ఐటీఆర్‌ దాఖలు చేయడం మంచిది.

క్రెడిట్​ లైన్​ గ్యారెంటీ స్కీమ్
కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా క్రెడిట్​ లైన్​ గ్యారెంటీ​ పథకాన్ని 2020 మే 13న ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కాన్ఫిడెన్స్​ బై కాన్ఫిడెన్స్​ స్కీమ్​ కింద డిక్లరేషన్​ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది.

ఎల్‌టీసీ క్యాష్ వోచర్
ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31లోగా మీ బిల్లులను సరైన ఫార్మాట్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్‌ నెంబర్‌ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్
ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ.10 వేల వరకు స్పెషల్​ ఫెస్టివల్​ అడ్వాన్స్​ పొందవచ్చు. ఎల్​టీసీ క్యాష్​ వోచర్​ పథకంతో పాటు 2020 అక్టోబర్​లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్​ తీసుకుంటే 10 వాయిదాల్లో డబ్బును తిరిగి చెల్లించవచ్చు.

డబుల్ టాక్సేషన్
కోవిడ్ -19 కారణంగా చాలా మంది విదేశీ పౌరులు, వలసదారులు భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించే ఆదాయంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్ సమర్పించి డబుల్ టాక్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. 2021 మార్చి 3న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. డబుల్ టాక్సేషన్ చెల్లింపుదారులు తమ వివరాలను ఫారం-ఎన్ఆర్ లో సమర్పించాల్సి ఉంటుంది.

చదవండి:

ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్

ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు