కేవలం 35 ఈవీ మోడల్స్​.. లక్షాఎనభై వేల కోట్ల ఖర్చు! తక్కువ రేటుకి అందించడమే లక్ష్యంగా..

27 Jan, 2022 19:42 IST|Sakshi

రాబోయేది ఈవీల కాలమే. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందుకే ఆటోమొబైల్​తో పాటు మొబైల్​ మేకింగ్​, ఇతర కంపెనీలు సైతం ఈవీల తయారీ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో కేవలం ఈవీ టెక్నాలజీ కోసమే లక్షా ఎనభై వేల కోట్ల ఖర్చుకు సిద్ధమయ్యాయి రెనాల్డ్​‌‌ నిస్సాన్​ కంపెనీలు.
 
ఫ్రెంచ్​ జపనీస్​ ఆటోమొబైల్​ల కూటమి ‘ఈవీ టెక్నాలజీ’ కోసం 26 బిలియన్​ డాలర్లు(మన కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలకు పైనే) పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ మేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ కూటమి. వచ్చే ఐదేళ్లకు ఈమేర ఖర్చు చేయనున్న కంపెనీలు పనిలో పనిగా జపాన్ ఆటోమేకర్​ మిట్సుబిషి మోటార్స్​ కార్పొరేషన్​ను తమతో భాగస్వామిగా చేర్చుకున్నాయి.

 

ఈవీలకు సంబంధించి పరిశోధనతో పాటు ఆటో పార్ట్​లు, ధరలను తగ్గించే టెక్నాలజీ తదితరాల ఆధారంగా 35 కొత్త మోడల్స్​తో ఈవీలను రూపొందించనున్నాయి. ఈ మేరకు 2030 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఐదు మోడల్స్​కు ఒకే విధమైన ప్రధాన​ విభాగాల్ని ఉపయోగించాలని ప్లాన్​ చేశాయి. నిస్సాన్​ తర్వాతి తరం బ్యాటరీల మీద ఫోకస్​ చేస్తుండగా.. రెనాల్ట్​ ఈవీలను అభివృద్ధి చేయడం, సాఫ్ట్​వేర్​, డిజిటల్​ సేవలు, ఫీచర్స్​ మీద దృష్టి సారించనున్నట్లు కూటమి చైర్మన్​ జీన్​ డోమినిక్యూ సెనార్డ్​ ప్రకటించారు. రెనాల్ట్​కు నిస్సాన్​లో 43 శాతం వాటా ఉంది, అలాగే రెనాల్ట్​లో నిస్సాన్​కు 15 శాతం వాటా ఉంది. టోక్యోకు చెందిన మిట్సుబిషిలో నిస్సాన్​(యోకోహామా కేంద్రంగా)కు 34 శాతం వాటా ఉంది. ఇక ఫ్రెంచ్​ ప్రభుత్వానికి రెనాల్ట్​లో 15 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్​ షార్టేజ్​ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇలా కొన్ని కంపెనీలు చేతులు కలిపి ఈవీ మార్కెట్​లో రాణించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ భాగస్వామి లేకుండా ప్రపంచంలో నెంబర్​ వన్​గా, ఈవీ కింగ్​గా కొనసాగుతోంది మాత్రం అమెరికన్​ ఆటో మేకర్​ టెస్లానే.

మరిన్ని వార్తలు