సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సృష్టించిన ఆరోగ్య స్పృహ వైద్య రంగంలో పెను మార్పులకు కారణమైంది. ముఖ్యంగా అనేక మంది యువతీ యువకులు తమ చూపును ఈ రంగంవైపు తిప్పేలా చేసింది. ముఖ్యంగా కరోనా భయం డయాగ్నస్టిక్స్ సేవలకు ఇంధనంలా మారింది. తద్వారా దేశీయ డయాగ్నస్టిక్స్ సర్వీసెస్ పరిశ్రమ మార్కెట్ వాటా ఏకంగా 16శాతం పెరిగి, 2022కల్లా రూలక్ష కోట్లకు దాని వ్యాపారం చేరుకోనుందని రిసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్ఐసిహెచ్) అంచనా వేసింది. ఇది ఈ రంగంలో పలు స్టార్టప్ కంపెనీలకు పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది.
ఇప్పటికే దాదాపు 35 శాతం మార్కెట్ వాటాతో ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న హైదరాబాద్లో వైద్య రంగంలో ఈ తరహా స్టార్టప్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ‘రిచ్’ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఆవిర్భవించిందని, భారతదేశపు అతిపెద్ద మెడ్ టెక్ పార్క్ నగరంలో ఉండడం, పెద్ద సంఖ్యలో పరిశోధనా సంస్థలు, దాదాపు 15కిపైగా సైన్స్ ఇన్క్యుబేటర్స్.. ఇవన్నీ స్థానికంగా స్టార్టప్స్కు ఊతమిస్తాయని చెప్పారు.
చదవండి:
హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత