Retail Inflation: సామాన్యులకు కాస్త ఊరట..!

12 Jul, 2021 20:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు పెట్రోల్‌ ధరలతో, మరో వైపు ఆహర ఉత్పత్తుల ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో సామాన‍్య జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న వేళ సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది.  భారత్‌లో జూన్‌ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా  6.26 శాతానికి తగ్గింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో సుమారు 6.3 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం రోజున రిటైల్‌ ద్రవ్యోల్భణ  గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనాలకు మించి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది రెండోసారి. 

జూన్‌ నెలలో  ప్రధానంగా ఆహరోత్పత్తుల ధరలు, ఇంధన ధరల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతానికి పెరిగిందని, మేలో ఇది 5.01 శాతంగా ఉందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా ఉంది. 'ఇంధన, లైట్‌' విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలతో పోల్చుకుంటే జూన్‌ నెలలో 12.68 శాతం గణనీయంగా  పెరిగింది మే నెలలో  11.58 శాతంగా నమోదైంది. 

మరిన్ని వార్తలు