సామాన్యునిపై ధరల భారం

13 Oct, 2020 05:00 IST|Sakshi

సెప్టెంబర్‌లో 7.34 శాతం ధరల పెరుగుదల

ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని దాటి ధరలు తీవ్రమవుతున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34 శాతంగా (2019 సెప్టెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. గత ఎనిమిది నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.  జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.

ముఖ్య విభాగాలు చూస్తే...
► వినియోగ ధరల సూచీలో ఒక్క కన్జూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ను చూస్తే,  సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం భారీగా 10.68%కి ఎగసింది. కూరగాయల ధరలు 20.73% పెరిగాయి. ప్రొటీన్‌ రిచ్‌ గుడ్ల ధరలు 15.47% పెరిగాయి.  
► ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం 2.87 శాతంగానే ఉంది.  

తగ్గుతుందంటున్న ఆర్‌బీఐ...: నిజానికి ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 4% వద్ద ధరల స్పీడ్‌ ఉండాలి. దీని ప్రాతిపదికనే తన ద్రవ్య పరపతి విధానంలో కీలకమైన రెపో రేటుపై (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4%) ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటోంది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బం దులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది.

తాజా అక్టోబర్‌ విధాన సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికా ల్లో  లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నా యనేది ఆర్‌బీఐ అంచనా.  సెప్టెంబర్‌ త్రైమాసికంలో  రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 6.8%గా ఉంటుందని,  అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. వెరసి డిసెంబర్‌ త్రైమాసికంలో (క్యూ3) 5.4%కి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5%కి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది.

మరిన్ని వార్తలు