ఎఫ్‌అండ్‌వోలో రిటైలర్లకు నష్టాలే

27 Jan, 2023 12:12 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) రిటైల్‌ ఇన్వెస్టర్లు చేపట్టిన ఈక్విటీ డెరివేటివ్‌(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నివేదిక తాజాగా వెల్లడించింది. ప్రతీ 10 మంది రిటైల్‌ ఇన్వెస్టర్లలో 9 మంది ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ లావాదేవీలలో నష్టపోయినట్లు పేర్కొంది. దీంతో అటు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, ఇటు బ్రోకర్లు అదనపు రిస్కులపై సమాచారాన్ని అందించేలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలియజేసింది.

2019–22 మధ్య కాలంలో టాప్‌–10 స్టాక్‌ బ్రోకర్ల వద్ద నమోదైన రిటైల్‌ ఇన్వెస్టర్ల గతేడాది ఎఫ్‌అండ్‌వో టర్నోవర్‌ ఆధారంగా అధ్యయనం చేపట్టింది. మొత్తం రిటైల్‌ క్లయింట్ల టర్నోవర్‌లో ఇది 67% వాటాకాగా.. 89 శాతం మందికి నష్టాలే మిగిలినట్లు వెల్లడించింది. అంటే ప్రతీ 10 మందిలో 9 మంది ఎఫ్‌అండ్‌వో లావాదేవీల ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయినట్లు తెలియజేసింది. 90% యాక్టివ్‌ ట్రేడర్లను పరిగణిస్తే ఈ నష్టం రూ. 1.25 లక్షలుగా నమోదైనట్లు వెల్లడించింది. వెరసి డెరివేటివ్‌ విభాగంలో 11% మంది రిటైలర్లు మాత్రమే లాభాలు ఆర్జించారు. సగటున రూ. 1.5 లక్షల లాభం నమోదైంది.

చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్‌ సొంతం.. అదో రేర్‌ రికార్డ్‌!

మరిన్ని వార్తలు