రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారం ఎంఎస్‌ఎంఈ పరిధిలోకి: గడ్కరీ

3 Jul, 2021 05:16 IST|Sakshi

న్యూఢిల్లీ: రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలను కూడా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) రంగం పరిధిలోకి చేరుస్తున్నట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. దీంతో ఆయా వర్గాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ట్వీట్‌ చేశారు.

తాజా మార్గదర్శకాలతో 2.5 కోట్లపైగా రిటైల్, హోల్‌సేల్‌ ట్రేడర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. వారు ఉద్యమ్‌ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్‌ఎంఈలకు వర్తిం చే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్‌ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు