Revolt RV400 దూకుడు, మరోసారి రికార్డు అమ్మకాలు

16 Jul, 2021 12:48 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారి కంపెనీ రివోల్ట్‌ మోటార్స్  ఇటీవల ఆవిష్కరించిన ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్‌ అమ్మకాల్లో దూసుకుపోయింది. బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన  రెండోసారి కూడా క్షణాల్లో  రికార్డు అమ్మకాలను సాధించిందని కంపెనీ  ప్రకటించింది. 

తొలి బుకింగ్స్‌లోనే రికార్డు అమ్మకాలను సాధించిన ఎలక్ట్రిక్ బైక్‌ రివోల్ట్‌ ఆర్‌వీ 400 బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన నిమిషాల్లోనే  ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచిందని  కంపెనీ వెల్లడించింది. తమ బైక్స్‌ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం నాలుగు నెలలు అని, అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, తద్వారా వెయిటింగ్ టైంను తగ్గించడానికి కంపెనీ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై,అహ్మదాబాద్,హైదరాబాద్నగరాల్లో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. అయితే గత నెలలో బుకింగ్స్‌ ఆరంభించిన రెండు గంటల్లోనే రూ. 50 కోట్ల విలువైన రివోల్ట్ ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్స్‌ విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. 

ఇటీవల రివోల్ట్‌ ఆర్‌వీ 300, ఆర్‌వీ 400 పేరుతో రెండు ఎలక్ట్రిక్ బైక్స్‌ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రివోల్ట్‌ ఆర్‌వీ 400 3కిలోవాట్స్‌ (మిడ్ డ్రైవ్) మోటారుతో లభ్యం. ఇది 72వీ, 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ఈ  బైక్స్‌కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ మై రివోల్ట్ యాప్ ద్వారా సాంకేతిక సమస్యలను తెలుసుకోవచ్చు. అంతేకాదు బ్యాటరీ స్టేటస్‌, రైడ్స్‌ డేటా, ఎన్ని కిలోమీటర్లు పూర్తయ్యాయి లాంటి వివరాలను కూడా అందిస్తుంది.  దీంతోపాటు రీచార్జ్‌ నిమిత్తం సమీప రివోల్ట్ స్విచ్ స్టేషన్‌ను కూడా ఈ యాప్‌ద్వారా గుర్తించవచ్చు. 

మరిన్ని వార్తలు