అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్..!

21 Jan, 2022 21:20 IST|Sakshi

ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 డిసెంబర్, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం(క్యూ3 ఎఫ్ వై22) ఫలితాలను విడుదల చేసింది. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ₹18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది క్రితం 3వ త్రైమాసికంలో పొందిన లాభం కంటే (₹13,101 కోట్ల) 41 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన చమురు-రిటైల్-టెలికామ్ ఆదాయం ₹1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 54% పెరిగి ₹1.91 లక్షల కోట్లకు చేరుకుంది.

ఫలితాల విడుదల ముందు శుక్రవారం రిలయన్స్ ఎన్ఎస్ఈలో ₹2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్ గత ఏడాది కాలంలో 18.26% పెరిగింది. రిలయెన్స్ జియో అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త కస్టమర్లను పొందింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు. 

"మా రిలయన్స్ అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్ వై22లో సంస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది అని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ & డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలు నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, మేము భవిష్యత్తు వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు & భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. 

(చదవండి: యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!)

మరిన్ని వార్తలు