రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌..! ఇన్ఫోసిస్‌  నారాయణమూర్తి అల్లుడికి చిక్కులు..!

25 Mar, 2022 13:00 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ద ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. కాగా ఇప్పుడు ఇదే యుద్దం ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది.  

రష్యాలో ఇన్ఫోసిస్‌ ఉనికిపై..!
యూకే ఛాన్స్‌లర్‌ ఆఫ్‌ ఎక్స్‌చెకర్‌, ఫైనాన్స్‌ మినిష్టర్‌గా రిషి సునక్‌ వ్యవహారిస్తోన్న విషయం తెలిసిందే. వీరు స్వయాన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి భర్త. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రష్యాలో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ విషయంపై ప్రముఖ బ్రిటన్‌ వార్త సంస్థ రిషి సునక్‌పై  ప్రశ్నల వర్షం కురిపించింది. అమెరికాతో పాటుగా యూరప్‌ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్‌ ఉనికిపై సునక్‌ను ప్రశ్నించారు. యూకే ఆర్థిక మంత్రి ఇంట్లోని వారు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ సదరు వార్త పత్రిక సునక్‌ను ఇంటర్వూలో అడిగారు. ‘మీ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని, మీ భార్యకు కూడా కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ’ సదరు పత్రిక పేర్కొంది. రష్యాకు చెందిన ఆల్ఫా బ్యాంక్‌తో ఇన్ఫోసిస్‌కు సంబంధాలున్నాయనంటూ వెల్లడించారు.

సంబంధం లేదు..!
ఇన్ఫోసిస్‌-రష్యా వ్యవహారంపై యూకే మంత్రి రిషి సునక్‌ సదరు పత్రికకు ధీటైనా జవాబునిచ్చారు. ‘నేను ఇక్కడికి ఎన్నికైన నాయకుడుగా వచ్చాను. తాను దేనికి బాధ్యత వహిస్తానో దాని గురించి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని బదులు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రిషి సునక్‌ కుటుంబం ప్రయోజనాలు పొందుతుందనే విషయంపై...ఇన్ఫోసిస్‌కు చెందిన వ్యవహారం పూర్తిగా కుటుంబ సభ్యులే చూసుకుంటారు. నాకు ఎలాంటి అవసరం లేదంటూ తెలిపారు. ఇక కంపెనీ వ్యవహారాలతో తనకేలాంటి సంబంధాలు లేవని ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న చర్యలను తోసిపుచ్చారు. కాగా రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో తాము శాంతికి మద్దతు ఇస్తామని ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ కైవసం.. డీల్‌ విలువ ఎంతంటే?

మరిన్ని వార్తలు