Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..

14 Apr, 2023 17:39 IST|Sakshi

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ఒక్క రోజులో రూ.68 కోట్లు అందుకోనున్నారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఇటీవల డివిడెండ్లను ప్రకటించింది. వీటి ద్వారా అక్షతా రూ.68.17 కోట్లు ఆర్జించనున్నారు.

(Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...)

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. గత ఏడాది ఆమె కంపెనీకి చెందిన 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున జూన్ 2 నాడు ఆమె ఈ మొత్తాన్ని అందుకోనున్నారు. అయితే దాని కోసం ఆమె తన స్టాక్ హోల్డింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. గతేడాది కంపెనీ డివిడెండ్ కలిపితే ఆమె మొత్తం ఆదాయం రూ.132.4 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ అక్టోబర్‌లో ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

గతేడాది మూర్తి ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్‌ను అందుకున్నారు. దీంతో ఆమెకు రూ.120.76 కోట్లు వచ్చాయి. ఇన్ఫోసిస్‌లో ఆమె షేర్ల విలువ రూ.5400 కోట్లు. ఆమె భర్త, భారత సంతతికి చెందిన రుషి సునాక్ గత అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. రుషి సునాక్ బ్రిటిష్ పౌరుడు. కానీ అక్షత మాత్రం తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. అందుకే ఆమె అక్కడ నివాసితురాలు కాదు. దీని కారణంగా యూకే చట్టాల ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించకుండా దేశంలో నివసించవచ్చు. ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే తన ఆదాయంపై పన్నులు ఉన్నాయని వాటిని ఎప్పుడూ చెల్లిస్తానని ఆమె చెప్పారు.

(tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) 

అక్షతా మూర్తి కర్ణాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. బెంగళూరులో ఆమె పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కాలేజీలో ఎకనామిక్స్ అండ్‌ ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్‌లు పూర్తి చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. స్టాన్‌ఫోర్డ్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రుషి సునాక్‌ను కలిశారు. వీరికి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క.

రుషిసునాక్‌, అక్షత దంపతులు రియల్ ఎస్టేట్‌లో ఎ‍క్కువగా పెట్టుబడులు పెట్టారు. కెన్సింగ్టన్‌లో వీరికి సొంత ఇల్లు ఉంది. దీని విలువు రూ.71 కోట్లు. వీరికి అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. కాలిఫోర్నియాలో ఒక పెంట్‌హౌస్, యార్క్‌షైర్‌లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి రచయిత్రి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అక్షతా మూర్తికి అక్షతా డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి ఫ్యూజన్ దుస్తులను ఆమె తయారు చేస్తుంటారు.

మరిన్ని వార్తలు