వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక ఉద్రిక్తతలే అవరోధం

25 Aug, 2022 05:52 IST|Sakshi

ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సభ్యులు జయంత్‌ ఉద్ఘాటన  

న్యూఢిల్లీ: భారతదేశ వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే అతిపెద్ద ప్రమాదకరంగా తయారయ్యిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు జయంత్‌ ఆర్‌ వర్మ ఉద్ఘాటించారు.  ప్రత్యేకించి ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి వ్యాపిస్తే దేశ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చిపడతాయని  ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి మేలు చేకూర్చే అంశం.  దేశంలో ఈ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగదని భావిస్తున్నా.  రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత 6 స్థాయిలోపునకు తీసుకురావడానికి ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం కట్టుబడి ఉంది.  
► ఎకానమీ పట్ల ఆశావహ పరిస్థితే ఉంది. పలు రంగాలు, పరిశ్రమలలో రికవరీ అసమానంగా ఉన్నప్పటికీ, వినియోగ డిమాండ్‌ కోలుకోవడం ప్రారంభమైంది. ఇది హర్షణీయ పరిణామం.  
► పరిశ్రమ, వివిధ రంగాల సామర్థ్య వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం మూలధన వ్యయాల పెంపుపై పలు రంగాలు వ్యూహ రచన చేస్తున్న సంకేతాలు ఉన్నాయి.  
► పలు కీలక అంశాలు దేశీయ మారకపు రేటు కదలికలకు కారణాలుగా ఉంటాయి. అందులో ద్రవ్యోల్బణం ఒక కారణం. ప్రస్తుత రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు.

మరిన్ని వార్తలు