ప్రమాదంలో మరో బ్యాంక్‌.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన!

15 Mar, 2023 13:35 IST|Sakshi

అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో కలవరం మొదలైంది. 2008 తర్వాత ఈ స్థాయిలో బ్యాంకులు కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్‌ సంస్థ క్రెడిట్‌ సూయిస్ సైతం మూసివేసే పరిస్థితి నెలకొందంటూ ప్రముఖ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్‌ రైటర్‌, వాల్‌ స్ట్రీట్‌ అనలిస్ట్‌ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అభిప్రాయం వ్యక్తం చేశారు. 

2008 అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. ఆ బ్యాంక్‌ పతనం కాబోతుందంటూ రాబర్ట్‌ కియోసాకి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. బ్యాంక్‌ను మూసివేయడం, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడడం ఇలా అనిశ్చిలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో క్రెడిట్‌ సూయిస్ సైతం చిన్నాభిన్నం కాబోతుందంటూ కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాండ్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది. ఫెడ్ రేట్ల పెంపు, యుఎస్ డాలర్‌ క్షీణించడం వంటి అంశాల కారణంగా మార్కెట్‌లో ఆర్ధిక ఆనిశ్చితులు నెలకొన్నాయని కియోసాకి ఫాక్స్ న్యూస్ 'కావుటో : కోస్ట్ టు కోస్ట్' షోలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద పెట్టుబడి బ్యాంకు క్రెడిట్‌ సూయిస్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో అస్థిరత సమయంలో, బంగారంలో పెట్టుడులు, కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు