చేతులు కలిపిన ఇన్ఫోసిస్‌, రోల్స్‌ రాయిస్‌!

8 Apr, 2022 07:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, పారిశ్రామిక టెక్నాలజీ సంస్థ రోల్స్‌–రాయిస్‌ జట్టు కట్టాయి. బెంగళూరులో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని గురువారం ఆవిష్కరించాయి. 

రోల్స్‌–రాయిస్‌ గ్రూప్‌లో భాగమైన వ్యాపార విభాగాలకు అవసరమయ్యే అత్యున్నత స్థాయి పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సర్వీసులను అందించేందుకు ఇది తోడ్పడనుంది. ఏడేళ్ల కాలవ్యవధి గల ఈ డీల్‌.. ఇరు సంస్థలకు ప్రయోజనకరమైనదని ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్మీత్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్‌ రంగం తిరిగి పుంజుకుంటున్న క్రమంలో ఇన్ఫీతో కలిసి ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్‌ కేంద్రం తమ అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయగలదని రోల్స్‌–రాయిస్‌ ప్రెసిడెంట్‌ (భారత్, దక్షిణాసియా) కిశోర్‌ జయరామన్‌ పేర్కొన్నారు.

రోల్స్‌–రాయిస్‌ సివిల్‌ ఏరోస్పేస్‌ వ్యాపారానికి ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డీ సర్వీసుల కోసం ఇరు కంపెనీలు 2020 డిసెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌లో ఇంజినీరింగ్, ఆర్‌అండ్‌డీ సర్వీసులకు తోడ్పాటునిచ్చేలా గత దశాబ్దకాలంలో రోల్స్‌–రాయిస్‌ బెంగళూరులో వివిధ విభాగాలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.  
 

మరిన్ని వార్తలు