న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ యుద్ధనౌకలను అభివృద్ధి చేయడానికి సంబంధించి భారత నౌకాదళంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఏరో ఇంజిన్స్ తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం రోల్స్–రాయిస్ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత నేవీకి యుద్ధ నౌకలు మొదలైన వాటిని ఆధునికీకరించేందుకు అపార అనుభవం తమకుందని కంపెనీ నేవల్ సిస్టమ్స్ విభాగం చీఫ్ రిచర్డ్ పార్ట్రిడ్జ్ తెలిపారు. నౌకలను హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి ఎలక్ట్రిక్ విధానంలో నడిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను తాము అందించగలమని వివరించారు. బ్రిటన్ నేవీ కోసం ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్–ఎలక్ట్రిక్ నేవల్ సిస్టమ్ డిజైనింగ్ నుంచి తయారీ దాకా తామే చేసినట్లు రిచర్డ్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ టూర్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.