రూట్‌ మొబైల్‌ ఐపీవో 9న

5 Sep, 2020 15:18 IST|Sakshi

ధరల శ్రేణి షేరుకి రూ. 345- 350

11న ముగింపు- కనీస దరఖాస్తు 40 షేర్లు

ఇష్యూ ద్వారా రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యం

వ్యూహాత్మక అవసరాలకు నిధుల వినియోగం

ఓమ్నిచానల్‌ క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసుల సంస్థ రూట్‌ మొబైల్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. ఇష్యూ 11న(శుక్రవారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్‌ కుమార్‌ గుప్తా, రాజ్‌దీప్‌ కుమార్‌ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్‌ మొబైల్‌ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.

లాట్‌ 40 షేర్లు 
రూట్‌ మొబైల్‌ పబ్లిక్‌ ఇష్యూకి రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్‌ దాఖలు చేయవచ్చు. రూట్‌ మొబైల్‌ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్‌ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్‌ప్రైజెస్‌, మొబైల్‌ ఆపరేటర్, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్‌ టు పీర్‌(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్‌, ఓటీటీ బిజినెస్‌ మెసేజింగ్‌, వాయిస్‌, ఓమ్ని చానల్‌ కమ్యూనికేషన్‌ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు