యూఎస్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ జోరు

23 Aug, 2021 05:51 IST|Sakshi

ఏప్రిల్‌–జూన్‌లో రూ. 1.48 లక్షల కోట్లు

220 బిలియన్‌ డాలర్లకు పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో యూఎస్‌ ప్రభుత్వ సెక్యూరిటీలలో దేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. 20 బిలియన్‌ డాలర్లు(రూ. 1.48 లక్షల కోట్లు) ఎగసి 220 బిలియన్‌ డాలర్లను అధిగమించాయి. ఇక గతేడాది జూన్‌తో పోలిస్తే యూఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీస్‌లో దేశీ పెట్టుబడులు దాదాపు 37 బిలియన్‌ డాలర్లమేర జంప్‌చేశాయి. తద్వారా యూఎస్‌ ట్రెజరీ పెట్టుబడులు అధికంగా దేశాల జాబితాలో భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. 1.277 లక్షల కోట్ల డాలర్లతో జపాన్‌ టాప్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. మార్చికల్లా 200 బిలియన్‌ డాలర్లకు చేరిన దేశీ పెట్టుబడులు ఏప్రిల్‌లో 208.7 బిలియన్‌ డాలర్లకు చేరగా.. మే నెలకల్లా 215.8 బిలియన్‌ డాలర్లను తాకాయి. ఈ బాటలో జూన్‌ చివరికి 220 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. గతేడాది జూన్‌కల్లా ఇవి 182.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. ఓవైపు యూఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. ఈ నెల రెండో వారానికల్లా రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద గల ఫారెక్స్‌ నిల్వలు 621 బిలియన్‌ డాలర్లను దాటడం ద్వారా సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకడం విశేషం!

మరిన్ని వార్తలు