మౌలికానికి మరింత బూస్ట్‌!

17 Mar, 2021 14:38 IST|Sakshi

డీఎఫ్‌ఐ ఏర్పాటుకు కేబినెట్‌ ఓకే 

ప్రాజెక్టులకు నిధుల వెసులుబాటు 

రానున్న కొన్నేళ్లలో రూ.3 లక్షల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధుల వెసులుబాటుకు కేంద్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలు కల్పించే బిల్లును కేబినెట్‌ మంగళవారం అనుమతించింది. తద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. ప్రభుత్వం 2025 కల్లా మౌలిక రంగంలో రూ. 111 లక్షల కోట్లను వెచ్చించాలని ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 20,000 కోట్ల పెట్టుబడులతో డీఎఫ్‌ఐ ఏర్పాటుకు ప్రతిపాదించారు. బడ్జెట్‌ ప్రతిపాదిత డీఎఫ్‌ఐ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బిల్లును ఆమోదించడం సంతోషదాయకమని సీతారామన్‌ పేర్కొన్నారు. తొలి దశ పెట్టుబడిని ప్రభుత్వం సమకూర్చనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.  

పన్ను రాయితీలు 
రానున్న కొన్నేళ్లలో డీఎఫ్‌ఐ ద్వారా మార్కెట్ల నుంచి రూ.మూడు లక్షల కోట్లను సమీకరించే యోచనలో ఉన్నట్లు సీతారామన్‌ తెలియజేశారు. డీఎఫ్‌ఐకు పదేళ్లపాటు పన్ను రాయితీలు అమలుకానున్నట్లు వెల్లడించారు. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి ద్వారా పెన్షన్‌ ఫండ్స్, సావరిన్‌ ఫండ్స్‌ తదితర భారీ సంస్థల నుంచి నిధులను సమకూర్చుకోగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వృత్తినిపుణులతో కూడిన బోర్డు  డీఎఫ్‌ఐ నిర్వహణను చేపట్టనున్నట్లు  ఆర్థిక మంత్రి తెలియజేశారు. బోర్డులో కనీసం 50 శాతం అనధికార డైరెక్టర్లుంటారని వెల్లడించారు. ఆయా రంగాలలో నైపుణ్యమున్న సుప్రసిద్ధ వ్యక్తులతో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. చైర్మన్‌ను సైతం ఇదే విధంగా ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. గతంలోనూ డీఎఫ్‌ఐ తరహా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఐడీబీఐ తదితరాలు విభిన్న కారణాలతో ఇతర బిజినెస్‌ కార్యకలాపాల్లోకి మళ్లినట్లు వివరించారు. 

చదవండి:

క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్!

మరిన్ని వార్తలు