శబరిమలకి ఆర్టీసీ సర్వీసులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

16 Nov, 2021 12:57 IST|Sakshi

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రతీ ఒక్క అవకాశాన్ని గరిష్టంగా వినియోగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల కోసం శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. 

శబరికి బస్సులు
కార్తీక మాసం రావడంతో పల్లె పట్నం తేడా లేకుండా అయ్యప్పమాల ధరించిన వారే కనిపిస్తున్నారు. స్వామి శరణం మాట ప్రతీ చోట ధ్వనిస్తోంది. ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల విరణమ కోసం శబరిమలకి వెళ్తుంటారు. ఇలా వేళ్లే వారు ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేటు వెహికల్స్‌నే ఆశ్రయిస్తున్నారను. కాగా అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.

ఐదుగురికి ఫ్రీ
శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్‌ 1 డిపో తరఫున ట్విట్టర్‌లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బుక్‌ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్‌, పదేళ్లలోపు ఇద్దరు మునికంట స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ‍ర్టీసీ అంటోంది. మొత్తంగా మూడు ఫుల్‌ టిక్కెట్లు, రెండు ఆఫ్‌ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు.

ఛార్జీలు ఇలా
శబరిమలైకి వెళ్లే భక్తులు అయ్యప్ప దర్శనంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. ఈ టూర్‌కి అనుగుణంగా ఆర్టీసీ కిలోమీటర్ల వంతున ఛార్జీలు నిర్ణయించింది. వీటితో పాటు ప్రతీ గంటకు రూ.300ల వంతున వెయిటింగ్‌ ఛార్జీ్‌ కూడా ఉంటుంది. గంటకు సగటున 30 కిలోమీటర్ల వంతున ప్రయాణ సమయాన్ని లెక్కిస్తున్నారు. ఆర్టీసీ శబరిమలై బస్సుల ఛార్జీలు ఇలా ఉన్నాయి.
- 36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు రూ.48.96
- 40 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.47.20
- 48 సీట్లు ఉన్న డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు రూ.56.64
- 49 సీట్లు ఉన్న ఆర్టీసీ బస్సులకు కిలోమీటరుకు రూ.52.49


చదవండి:ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ప్రిన్స్‌ మహేశ్‌.. అదిరింది సార్‌!

మరిన్ని వార్తలు