కస్టమర్లకు ఊరట : ఇక ఆర్టీజీఎస్‌ సేవలు నిరంతరం

9 Oct, 2020 16:36 IST|Sakshi

ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఊరటగా నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్టీజీఎస్‌) ఇక వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్‌ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్‌ఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

కాగా 2019 డిసెంబర్‌ నుంచి నెఫ్ట్‌ సదుపాయాన్ని ఆర్బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్‌ వ్యవస్థను గత ఏడాది డిసెంబర్‌ నుంచి 24x7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్‌ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. ఆర్టీజీఎస్‌ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు బదలాయించవచ్చు. ఆర్టీజీఎస్‌ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి. చదవండి : వడ్డీ రేట్లు యథాతథం

మరిన్ని వార్తలు