75 చేరువకు రూ‘పాయె’

7 Oct, 2021 03:45 IST|Sakshi

54పైసలు నష్టంతో 74.98 వద్ద ముగింపు

ఐదు నెలల కనిష్టం  

ముంబై: భారత్‌ రూపాయి విలువ డాలర్‌ మారకంలో బుధవారం భారీగా 54 పైసలు పడిపోయింది. 74.98 వద్ద ముగిసింది. గడచిన ఐదు నెలల్లో (ఏప్రిల్‌ 23 తర్వాత) రూపాయి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఆరు నెలల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా గత తొమ్మిది ట్రేడింగ్‌ షెషన్లలో ఎనిమిది రోజులు రూపాయి నష్టాలను చవిచూసినట్లయ్యింది.   దేశీయంగా ఈక్విటీల బలహీనతలకు తోడు అంతర్జాతీయంగా డాలర్‌ బలోపేత ధోరణి రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయికి ప్రతికూలం అవుతున్నాయి. ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో 74.63 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.54 కనిష్ట–74.99 గరిష్ట స్థాయిల్లో కదలాడింది.

రూపాయి 75 స్థాయిని కాపాడుకోలేకపోతే మరింత పతనం తప్పకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ విశ్లేíÙంచారు. సమీప కాలానికి 73.95 వద్ద మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు.   ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ  నష్టాల్లో 74.82 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్‌ ఫ్రాంక్, జపనీస్‌ యన్, కెనడియన్‌ డాలర్, బ్రిటన్‌ పౌండ్, స్వీడిష్‌ క్రోనా)  ప్రాతిపదకన లెక్కించే డాలర్‌ ఇండెక్స్‌  భారీ లాభాల్లో  94.30 పైన ట్రేడవుతోంది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ) కాగా అంతర్జాతీయంగా నైమెక్స్‌ స్వీట్‌ క్రూడ్‌ బేరల్‌ ధర 78.64 వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్‌ విషయంలో ఈ ధర 82.50 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు